ముంబై: ‘మిసెస్ కేరళ’ బ్యూటీ పేజెంట్ మాజీ కంటెస్టెంట్, 28 ఏళ్ల మోడల్ ఒకరు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతూ ముంబై ఎయిర్పోర్టులో అడ్డంగా బుక్కయ్యారు. బ్యాంకాక్ నుండి భారతదేశానికి కోట్ల రూపాయల విలువైన ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని (Hydroponic Weed) అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలిని హర్షా సన్నీగా గుర్తించారు. ఆమె జూన్ 10-11 మధ్య రాత్రి సమయంలో బ్యాంకాక్ నుండి ఎయిర్ ఇండియా విమానం TG-351 ద్వారా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, ఆమెను అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద ఉన్న లగేజీ (ట్రాలీ) బ్యాగులో వాక్యూమ్-సీల్డ్ చేసిన 12 డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అధికారులకు ఆకుపచ్చ రంగులో ఉన్న పదార్థం కనిపించింది. ఎన్డీపీఎస్ (NDPS) ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా ప్రాథమికంగా పరీక్షించగా.. అది ఎండబెట్టిన పూలు, పండ్ల పైభాగాల రూపంలో ఉన్న నాణ్యమైన గంజాయి (దీనిని సాధారణంగా హైడ్రోపోనిక్ వీడ్ అని పిలుస్తారు) అని తేలింది. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు ₹11.82 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
డ్రగ్స్ స్వాధీనం అనంతరం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ లోని సంబంధిత సెక్షన్ల కింద హర్షా సన్నీని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా, ఎస్ప్లానేడ్ (ఖిల్లా) కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, హర్షా సన్నీ గతంలో 2025లో జరిగిన ‘మిసెస్ కేరళ’ బ్యూటీ పేజెంట్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్పై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
థానేలో రూ. 3 కోట్ల కశ్మీర్ డ్రగ్స్ నెట్వర్క్ ధ్వంసం!
మహారాష్ట్రలోనే చోటుచేసుకున్న మరో ప్రధాన ఘటనలో.. కశ్మీర్ లోయతో సంబంధాలు ఉన్న ఒక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ను థానే సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ₹3.03 కోట్ల కంటే ఎక్కువ విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
మీడియా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అమర్సింగ్ జాదవ్ మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ప్రారంభించిన ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్లో భాగంగానే ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. పక్కా సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్ బృందం ముంబ్రా వైపు వెళ్తున్న గుజరాత్లోని అంక్లేశ్వర్ నివాసి ఫిరోజ్ అబ్దుల్ ఖాన్ (52) అనే అనుమానితుడిని అడ్డుకుంది. అతని వద్ద నుండి ₹3.02 కోట్ల విలువైన 3.020 కిలోల చరస్ (Charas) తో పాటు నిషేధిత ‘ట్రామడాల్’ డ్రగ్ ఉండే ‘SPASMO-PROXYVON R-PLUS’ కు చెందిన 12,984 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
