బ్రిటన్లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న కుంబ్రియా సెయింట్ బీస్ మరియు వేల్స్ తీరాలలో, ‘వెల్లెల్లా వెల్లెల్లా’ అని పిలవబడే ‘సముద్ర గాలిపటం’ రకానికి చెందిన విచిత్ర జీవులు నూరుల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకురావడం ఆ ప్రాంత ప్రజలలో తీవ్ర దిగ్భ్రాంతిని, భయాన్ని కలిగించింది.
చూడటానికి ఏలియన్ రూపంలో, ముదురు నీలి రంగులో ఉండే ఈ జీవులు సాధారణంగా భారతదేశం వంటి ఉష్ణమండల సముద్ర ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, అలవాటుకు భిన్నంగా బ్రిటన్ లో ఈ సంవత్సరం ఎండ తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగడమే ఇవి ఇంత పెద్ద సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకురావడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
రూపంలో జెల్లీ ఫిష్లా కనిపిస్తున్నప్పటికీ, ఇవి నిజమైన జెల్లీ ఫిష్లు కావు; ‘మ్యాన్ ఓ వార్’ అనే ప్రమాదకర సముద్ర జీవి కుటుంబానికి చెందిన ఒక రకం చిన్న జీవులు. సొంతంగా ఈదే సామర్థ్యం లేని ఈ జీవులు, సముద్రపు అలలు మరియు గాలి ప్రవాహంలోనే కొట్టుకుపోతాయి. ప్రస్తుతం వీటి సంతానోత్పత్తి విపరీతంగా పెరగడం వల్ల ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, వీటిని తాకితే తీవ్రమైన నొప్పి మరియు చర్మం మంట పుడుతుందని, అందువల్ల ప్రజలు ఎవరూ వీటి దగ్గరకు వెళ్లవద్దని పరిశోధకులు హెచ్చరించారు.
సాధారణంగా చల్లని వాతావరణం ఉండే బ్రిటన్ సముద్ర తీరంలో ఉష్ణమండల జీవులు ఒడ్డుకు రావడం అనేది భూతాపం మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలో వచ్చే ప్రమాదకర మార్పుల ఫలితమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, స్థానిక ప్రజలు ఇటువంటి అరుదైన సంఘటనను ఇప్పటివరకు చూడలేదని, ఇది భవిష్యత్తులో రాబోయే ఏదో ఒక పెద్ద ప్రకృతి విపత్తుకు హెచ్చరిక సంకేతమని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply