రాజస్థాన్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో, ప్రభుత్వ ప్రోటోకాల్లను పక్కనపెట్టి, నేరుగా వచ్చి 80 ఏళ్ల వృద్ధురాలి సమస్యను విని, వెంటనే పరిష్కరించిన కలెక్టర్ ప్రదీప్ గవాండే చర్య ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
సరిగ్గా నడవలేని 80 ఏళ్ల బామ్మకు, వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు (Fingerprints) చెరిగిపోయాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఆమెకు రావాల్సిన ప్రభుత్వ పింఛను నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆమె పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి కలెక్టర్ను కలవడానికి కార్యాలయానికి చేరుకుంది.
ఈ విషయం తెలియగానే ఏసీ రూమ్ వదిలి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే, ఆ బామ్మ సమస్యను విని వెంటనే అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. “బామ్మకు వెంటనే పింఛను పునరుద్ధరించాలి; అంతేకాకుండా ప్రభుత్వం నుండి అందాల్సిన ఇల్లు మరియు ఇతర పథకాల ప్రయోజనాలను వెంటనే అందించాలి” అని ఆయన ఆదేశించారు.
ప్రముఖ ఐఏఎస్ అధికారి టీనా దాబి భర్త అయిన ప్రదీప్ గవాండే, సివిల్స్ కంటే ముందు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆయనకు ఉన్నత పదవులు ఉన్నప్పటికీ, సామాన్య పేద కుటుంబ నేపథ్యం నుండి రావడం వల్లే ప్రజల కష్టాలను ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారని అక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు.
