మహారాష్ట్రలోని నాశిక్, సాత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్ పని ఇప్పిస్తామనే నెపంతో ఒక యువతిని ఏకంగా 2 లక్షల రూపాయలకు విక్రయించారు.
ఆ యువతిని నాంద్గావ్ తాలూకాలోని జతేగావ్ అనే ప్రాంతంలో బంధించి, బలవంతంగా పెళ్లి చేశారు. అయితే, సాత్పూర్ పోలీసులు అత్యంత సాహసోపేతంగా ఆ యువతిని రక్షించారు.
అసలేం జరిగింది?
సాత్పూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి కొన్ని రోజుల క్రితం అదృశ్యమైంది. తన కూతురు కనిపించడం లేదని తండ్రి సాత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్నా ఆమె జాడ దొరకలేదు. రెండు రోజుల తర్వాత ఆ యువతి రహస్యంగా తన తండ్రికి ఫోన్ చేసి కన్నీళ్లతో అసలు విషయం చెప్పింది. రాణి మరియు భాగి అనే ఇద్దరు మహిళలు తనను మాలెగావ్లో ఈవెంట్ పని ఉందని తీసుకెళ్లి, అక్కడి నుండి నాంద్గావ్కు తరలించి 2 లక్షల రూపాయలకు అమ్మేసినట్లు ఆ యువతి వాపోయింది.
గ్రామస్తుల ముట్టడి – ఉద్రిక్తత
విషయం తెలిసిన వెంటనే పోలీసులు నాంద్గావ్ చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో గాలించగా, జతేగావ్లోని నవనాథ్ శిరద్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఆ యువతి కనిపించింది. అయితే, పోలీసులు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సుమారు 200 నుండి 300 మంది గ్రామస్తులు పోలీసు బృందాన్ని చుట్టుముట్టారు. “మేము రెండు లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం, అమ్మాయిని ఇవ్వము” అంటూ భీష్మించుక కూర్చున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పెద్ద ముఠా హస్తం?
పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువతిని సురక్షితంగా రక్షించి నాశిక్కు తరలించారు. పేద కుటుంబాలకు చెందిన యువతులకు పని ఇప్పిస్తామని నమ్మించి, వారిని బలవంతంగా విక్రయించే పెద్ద ర్యాకెట్ (Racket) దీని వెనుక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులైన రాణి, భాగి అనే మహిళల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారు పట్టుబడితే మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply