ప్రస్తుతం యూరప్ దేశాలు తీవ్రమైన వడగాల్పుల బారిన పడి అల్లాడిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా, అక్కడి ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలపై కూడా తీవ్రంగా పడింది. పశ్చిమ ఐరోపాలో రైలు నెట్వర్క్ పూర్తిగా స్తంభించిపోగా, రోడ్లు కూడా కరిగిపోతున్నాయి.
శక్తి సంక్షోభం మరియు మౌలిక సదుపాయాల సమస్య: ఫ్రాన్స్లోని పలు అణు రియాక్టర్లను మూసివేశారు లేదా వాటి సామర్థ్యాన్ని తగ్గించారు. వీటి వల్ల నదుల్లోని నీరు విపరీతంగా వేడెక్కుతోంది. విద్యుత్ కేంద్రాలు మూతపడటంతో ఫ్రాన్స్, ఇటలీల్లోని వందలాది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భయంకరమైన ఎండల కారణంగా ఫ్యాక్టరీలలో కార్మికులు సమ్మెకు దిగారు.
నిప్పుల కొలిమిలా మారిన ఇళ్లు: యూరప్లోని పాత ఇళ్లను చల్లని వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించారు, కానీ ఇప్పుడు ఆ గోడలే వేడిని పీల్చుకుని రాత్రి పూట కూడా భవనాలను నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. ప్రజలు ఏసీల కోసం క్యూ కడుతున్నారు. ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి స్టీఫెనీ రిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, తీవ్రమైన వేడి కారణంగా కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. గతంలో 5-10 కేసులు ఉండగా, ఇప్పుడు 20-30కి పెరిగాయి.
ఆర్థిక నష్టం మరియు రవాణా ఇబ్బందులు: జర్మన్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘అలియంజ్’ నివేదిక ప్రకారం, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోయాయి. రైలు వ్యవస్థలు వేడిని తట్టుకోలేక జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్లలో అనేక రైళ్లను రద్దు చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పుడు యూరప్ దేశాలు ప్రత్యేక ‘హీట్ వేవ్ ప్లాన్’లను సిద్ధం చేస్తున్నాయి.
