అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ తనఖా సేవల సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ (Better.com) వ్యవస్థాపకుడు విశాల్ గార్గ్.. 2021లో క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు కేవలం 3 నిమిషాల జూమ్ కాల్లో ఏకంగా 900 మంది ఉద్యోగులను తొలగించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపారు.
భారత్లో పుట్టి న్యూయార్క్లో పెరిగిన ఈ భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, ఉద్యోగుల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన తీరుకు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
ఆ వివాదం తర్వాత బోర్డు ఒత్తిడితో కొన్నాళ్లు సెలవుపై వెళ్లి మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, సంస్థ పతనం మాత్రం ఆగలేదు.
కరోనా సమయంలో సుమారు 8 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో దూసుకెళ్లిన ఈ సంస్థ.. వడ్డీ రేట్ల పెరుగుదల, మార్కెట్ సంక్షోభం కారణంగా దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు పైగా భారీ నష్టాలను మూటగట్టుకుంది.
కంపెనీ షేర్లు 90 శాతానికి పైగా పతనమై సంస్థ విలువ భారీగా పడిపోయింది. నిరంతర ఆర్థిక నష్టాలు, విశాల్ గార్గ్ ఒంటెద్దు పోకడల కారణంగా సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను సీఈఓ పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించింది.
బోర్డు డైరెక్టర్ డేనియల్ లూయిస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టగా.. తనను అన్యాయంగా పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తూ విశాల్ గార్గ్ న్యాయపోరాటానికి దిగారు.
ఒకప్పుడు దయ లేకుండా 900 మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన సీఈఓ, నేడు తాను స్థాపించిన సొంత కంపెనీ నుంచే గెంటివేతకు గురికావడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

Leave a Reply