భాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు అగ్ర చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించి పేరు పొందిన ప్రముఖ నటి కీర్తి కుల్హారీ, సైబర్ మోసానికి గురై సుమారు 2.44 లక్షల రూపాయలను కోల్పోయారు.
ముంబై వర్సోవా ప్రాంతంలో నివసిస్తున్న ఈమె, గత కొన్ని రోజుల క్రితం అంధేరీలోని ఒక థియేటర్కు సినిమా చూడటానికి వెళ్తున్న సమయంలో, ఆమె క్రెడిట్ కార్డు నుండి విదేశీ సంస్థకు డబ్బు బదిలీ అయినట్లు మొబైల్ ఫోన్కు హఠాత్తుగా మెసేజ్ వచ్చింది.
ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన నటి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ను సంప్రదించి వివరాలు అడుగగా, ఆమె క్రెడిట్ కార్డును ఉపయోగించి నాలుగు వేర్వేరు లావాదేవీల ద్వారా మొత్తం రూ. 2,43,000 కంటే ఎక్కువ మొత్తం దోపిడీకి గురైందని తేలింది. ఇంకా పెద్ద ఎత్తున నష్టాలను నివారించేందుకు బ్యాంక్ వెంటనే ఆ కార్డును బ్లాక్ చేయడంతో పాటు, దీనిపై నటి తరఫున ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్లో కూడా అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, నటి తన కార్డ్ నంబర్, పిన్ (PIN) లేదా ఓటీపీ (OTP) వంటి ఎలాంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోలేదని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. దీని ఆధారంగా, డిజిటల్ సాంకేతికత లేదా ఇంటర్నెట్ అకౌంట్ల ద్వారా డేటాను హ్యాక్ చేసి ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా అనుమానిస్తున్నారు.

Leave a Reply