ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, మలక్పూర్ గ్రామంలోని ఒక సైబర్ కేఫ్లో రూ.80,000 దోపిడీకి గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ముఖానికి మాస్కులు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు, కేఫ్ సిబ్బంది ఉస్మాన్ను తుపాకీతో బెదిరించి నగదును ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ దృశ్యాలు దుకాణంలో అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో కేఫ్ యజమాని మోహిత్ మధ్యాహ్న భోజనం కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. అతను సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తుండటంతో, కేఫ్ బాధ్యతలను యువ ఉద్యోగి అయిన ఉస్మాన్కు అప్పగించి వెళ్లాడు. సరిగ్గా అదే అదనుగా చూసుకుని ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కేఫ్లోకి ప్రవేశించారు.
వారిలో ఒకడు తుపాకీ తీసి ఉస్మాన్ వైపు గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేయగా, మరొకడు కౌంటర్లో ఉన్న సుమారు రూ.80 వేల నగదును దోచుకున్నాడు. అనంతరం ఇద్దరూ బయట సిద్ధంగా ఉన్న బైక్పై వేగంగా పరారయ్యారు. పట్టపగలే జరిగిన ఈ దోపిడీ తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేసేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply