ఎంతో సంతోషంగా, సంబరంగా ప్రారంభమైన పుట్టినరోజు వేడుక.. ఊహించని విధంగా తీవ్ర విషాదంగా మారిన ఘటన నల్లాసోపరాలో తీవ్ర కలకలం, ఆవేదనను రేకెత్తించింది.
బర్త్డే వేడుకల కోసం ఎంతో ఇష్టంగా బేకరీ నుంచి తెచ్చిన కేక్ను కట్ చేసి, అక్కడున్న బంధువులు, చిన్నారులందరికీ తినిపించి సంబరపడ్డారు.
అయితే, ఆ కేక్ తిన్న కొద్దిసేపటికే వేడుకలో పాల్గొన్న వారికి ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, కళ్లు తిరగడం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పరిస్థితి విషమించింది. అప్పటివరకు కేరింతలతో సందడిగా ఉన్న పుట్టినరోజు ఇల్లు.. క్షణాల్లో ఆర్తనాదాలు, ఏడుపులతో ఆసుపత్రిని తలపించింది.
అసలేం జరిగిందో తెలియక దిగ్భ్రాంతికి గురై మిగిలిన కేక్ను పరిశీలించగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ కేక్ లోపల చనిపోయిన బల్లి పడి ఉండటాన్ని చూసి అందరూ షాకయ్యారు. బల్లి పడిన విషపూరిత కేక్ తినడం వల్లే చిన్నారులతో సహా మొత్తం 11 మంది తీవ్ర ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు.
అస్వస్థతకు గురైన వారందరినీ కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఆహార పదార్థాల పరిశుభ్రత విషయంలో బేకరీ యాజమాన్యాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆ కేక్ తయారు చేసి అమ్మిన బేకరీ షాపుపై పోలీసులు, ఆహార భద్రతా అధికారులు (Food Safety) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
