ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కబీర్ధామ్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కబీర్ధామ్ జిల్లా పండారియా నియోజకవర్గంలోని తెలియాపాని లెత్రా గ్రామ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తరగతి గదిలో మద్యం సీసాలు, అందుకు తగిన చిరుతిళ్లతో ఉపాధ్యాయుడు కూర్చుని మద్యం సేవిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. విద్యార్థులకు విద్యను, మంచి క్రమశిక్షణను నేర్పాల్సిన ఉపాధ్యాయుడే, విద్యాబోధన జరిగే పవిత్రమైన స్థలాన్ని మద్యం సేవించే ప్రదేశంగా మార్చడం అందరినీ అసహ్యానికి గురిచేసింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఒక ఉపాధ్యాయుడు తన బాధ్యతను విస్మరించి పాఠశాల పవిత్రతను దెబ్బతీసిన ఈ చర్య, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉన్నందున, సదరు టీచర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
