ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఒక మహిళను కారులో నుండి బయటకు ఈడ్చి, ఇటుకతో అతి కిరాతకంగా దాడి చేశాడు.
అసలేం జరిగింది?
కాన్పూర్ ఐఐటీ (IIT Kanpur)లో పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళను, ‘దేవాశిష్ నిగం’ అనే వ్యక్తి తన కారులో తీసుకెళ్తూ వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు. అయితే ఆ మహిళ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
దీనితో ఆగ్రహం చెందిన దేవాశిష్, కారును ఆపి రోడ్డు పక్కన ఉన్న ఇటుకను తీసుకురావడం చూసి భయపడిన ఆ మహిళ, కారు తలుపులు వేసుకుని లోపల దాక్కుంది. కానీ, ఆ కామాంధుడు బలవంతంగా కారు తలుపులు తెరిచి, ఆమెను బయటకు ఈడ్చి.. తలపై, శరీరంపై ఇటుకతో అత్యంత క్రూరంగా దాడి చేశాడు.
పోలీసుల ముందే అహంకారం
ఆ మహిళ కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, నిందితుడు దేవాశిష్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, అంతటి ఘోరానికి ఒడిగట్టిన ఆ నిందితుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా అక్కడికి వచ్చిన పోలీసుల దగ్గర తన కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ, “మా అమ్మ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి” అంటూ అధికార దర్పంతో పోలీసులనే బెదిరించడానికి ప్రయత్నించాడు.
ఈ నిందితుడి తల్లి లక్నో డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారని సమాచారం.
మహిళ పరిస్థితి విషమం
ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన సదరు బాధితురాలిని సమీపంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం ఆమె ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దేవాశిష్ను అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.
