పంజాబ్లోని కపుర్తలా పరిధిలో గల ఒక ప్రముఖ ఆలయం ముంగిట జరిగిన అమానవీయ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయ ద్వారం వద్ద కూర్చున్న ఒక యాచకురాలిపై ఒక దుర్మార్గుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సీసీటీవీ దృశ్యాలు ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆ మహిళ వెంట ఉన్న చిన్న పిల్లలు, గుడి సమీపంలో పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ను ఆడుకుంటూ తాకినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ బైక్ యజమాని, ఆ అభాగ్యురాలైన మహిళపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.
వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీలో, ఆ వ్యక్తి సదరు మహిళను కిందకి నెట్టేసి, కాళ్లకున్న చెప్పు తీసి నిర్దాక్షిణ్యంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న కొందరు భక్తులు, స్థానికులు పరుగున వచ్చి అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ… ఆ ఉన్మాది మళ్లీ వచ్చి ఆమెను కాళ్లతో తొక్కి తన్నాడు. ఈ పాశవిక చర్యను చూసిన నెటిజన్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
ఈ దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయింది. అయితే ఈ వీడియో వైరల్ అయి మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘాల దృష్టికి వెళ్లడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీఎస్పీ శీతల్ సింగ్ పర్యవేక్షణలో విచారణ ముమ్మరం చేశారు. వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తిని వికాస్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఇతను అదే ఆలయానికి ఎదురుగా ఒక దుకాణం నడుపుతున్నట్లు తెలిసింది. వికాస్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply