ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గణపతి గుడిలో, గత 20 రోజులుగా కనిపించకుండా పోయిన అంకిత్, ఇస్రార్ అనే ఇద్దరు ఆప్తమిత్రులు దారుణంగా హత్యకు గురై పూడ్చిపెట్టబడిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది.
అంకిత్ హిందూ మతానికి, ఇస్రార్ ముస్లిం మతానికి చెందినవారైనప్పటికీ, వీరిద్దరూ ఎంతో ప్రాణస్నేహితులుగా మెలిగేవారు.
సుమారు 20 రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదు. వారి కోసం గాలించిన బంధువులకు, వారు లహసౌడా గుడికి చెందిన పూజారిని కలవడానికి వెళ్లారని తెలిసింది. ఆ తర్వాత గుడి ప్రాంగణంలో జరిపిన తనిఖీల్లో, వారిద్దరి మృతదేహాలు గుడిలోనే పాతిపెట్టి ఉన్నట్లు గుర్తించి, పోలీసులు తవ్వి బయటకు తీశారు.
హత్య చేసిన మృతదేహాలను గుడి ప్రాంగణంలోని పిల్లర్ నిర్మాణం కింద గోతి తవ్వి పాతిపెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా దానిపై టైల్స్ (Interlocking Tiles) పరిచి మూసివేశారు. ఈ ఘోరానికి ఒడిగట్టింది గుడి పూజారేనంటూ మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, కుటుంబానికి చెందిన ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత పరారైన గుడి పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు, ఈ హత్యల్లో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
20 రోజులుగా గాలిస్తున్న హిందూ, ముస్లిం స్నేహితులిద్దరూ గుడిలోనే హత్యకు గురై పాతిపెట్టబడిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఉద్రిక్తతను నింపింది. పరారీలో ఉన్న పూజారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply