న్యూఢిల్లీ: కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితురాలైన సియా గోయల్.. ఈ ఘాతుకానికి పాల్పడటానికి కొన్ని రోజుల ముందే అతడిపై మరో హత్యాయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆమె మొదట ఎక్కడైతే అతడిని చంపాలని చూసిందో, చివరకు అదే స్థలంలోనే అతడి ప్రాణాలు తీసింది.
లోహగఢ్ కోటపై మొదటి హత్యాయత్నం – వింత సాకు:
‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. సియా అంతకుముందే కనీసం ఒకసారి కేతన్ను చంపడానికి ప్రయత్నించిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీరిద్దరూ కలిసి లోహగఢ్ కోటను సందర్శించినప్పుడు, ఆమె కేతన్ను వెనుక నుండి లోయలోకి నెట్టేయడానికి ప్రయత్నించింది. అయితే కేతన్ ఎలాగోలా తనను తాను నిలదొక్కుకుని కింద పడకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో “నన్ను ఎందుకు నెట్టేసావు?” అని కేతన్ ప్రశ్నించగా.. వాడు నిలబడిన చోట కాళ్ల దగ్గర ఒక పాము కనిపించిందని, దాని నుండి కాపాడటానికే అలా నెట్టేశానని సియా అబద్ధం చెప్పి నమ్మించింది.
పాస్పోర్ట్ మాయం – అనుమానించిన కేతన్:
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ ఘటన ఒక్కటే కాకుండా ఆమె ప్రవర్తనలో అనేక అనుమానాస్పద విషయాలు (Red flags) జరిగాయి. వీటిని తాము ముందే గుర్తించలేకపోయామని వారు వాపోయారు. కేతన్, సియా ఇద్దరూ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ‘బాలి’ (Bali) వెళ్లాల్సి ఉంది. కానీ ప్రయాణ సమయానికి కేతన్ పాస్పోర్ట్ ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ ట్రిప్ రద్దయింది. ఆ ప్రయాణానికి వెళ్లడం ఇష్టం లేక సియానే స్వయంగా కేతన్ పాస్పోర్ట్ను దాచేసిందని ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తొలిసారి లోనావాలా ట్రిప్ ముగిసిన తర్వాత.. తన పుట్టినరోజు కానుకగా తనను మళ్లీ లోహగఢ్ కోటకే ట్రెకింగ్కు తీసుకెళ్లాలని సియా పట్టుబట్టింది. ఆమె ప్రవర్తనపై కేతన్కు కూడా బలమైన అనుమానాలు వచ్చాయి. ఈ విషయమై వాడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆమె ప్రవర్తన బాగాలేదని చెప్పినప్పటికీ.. వారు ఆ మాటలను తేలికగా తీసుకున్నారు.
కోట్లు ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు:
కేతన్, సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం (ఎంగేజ్మెంట్) జరిగింది. రాబోయే నవంబర్ నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం రెండు కుటుంబాల వారు ఉదయ్పూర్లో ఒక విలాసవంతమైన హోటల్ను బుక్ చేసి, ముందస్తు ఏర్పాట్ల కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఫిబ్రవరిలో నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు, బయటకు వెళ్లేవారు. కొన్ని సందర్భాల్లో కేతన్.. సియా ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె కుటుంబ నేపథ్యాన్ని సరిగ్గా విచారించామా లేదా అని మమ్మల్ని అడిగాడు. కానీ, ఆ కుటుంబం మా దూరపు బంధువుల ద్వారా పరిచయం కావడంతో అంతా మంచే జరుగుతుందని నేను వాడికి నచ్చజెప్పాను” అని కన్నీరు పెట్టుకున్నారు.
ప్రియుడితో కలిసి దారుణ హత్య – పోలీసు కస్టడీకి నిందితులు:
పెళ్లి నిశ్చయమైనప్పటికీ వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తండ్రి తెలిపారు. సియా ఎప్పుడూ తన మొబైల్ ఫోన్లోనే మునిగిపోయేదని, ఆమె స్నేహితుడైన చేతన్ చౌదరి గురించి కేతన్ తమతో ప్రస్తావిస్తూ.. వారిద్దరి సంబంధంపై అనుమానం వ్యక్తం చేశాడని విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరినీ పోలీసులు ప్రధాన నిందితులుగా చేర్చారు. వీరిద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేయగా.. తామే పక్కా ప్లాన్ ప్రకారం కేతన్ను హత్య చేసినట్లు వారు పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) లోని సెక్షన్ 103 (హత్య), సెక్షన్ 61(2) (నేరపూరిత కుట్ర) కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం వీరిద్దరికీ జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
