తిరువనంతపురం: కేరళలోని శ్రీకార్యం ప్రాంతంలో ఒక ఇంటి బెడ్రూమ్ ఏసీలో ఏకంగా ఐదు పాములు కనిపించడం కలకలం సృష్టించింది.
టెక్నోపార్క్లో పనిచేసే మాధవ్ జె పణిక్కర్ అనే వ్యక్తి సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు, తన బెడ్రూమ్లోని ఏసీ కింద పాము తోక లాంటిది ఏదో వేలాడటం గమనించారు. వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ శాఖ సిబ్బంది వచ్చి టార్చ్ లైట్ వేసి చూడగా, అవి ‘కొంబేరి’ (లేదా విల్లూన్ని) రకానికి చెందిన పాములని గుర్తించారు. ఈ పాములకు విషం ఉండదు. అయితే, ఏసీని విప్పకుండా వాటిని పట్టుకోవడం సాధ్యం కాదని అధికారులు చెప్పారు. ఏసీ టెక్నీషియన్ను పిలిపించి ఏసీని తెరిచి చూడగా, లోపల మొత్తం ఐదు పాములు ఉన్నట్లు తేలింది.
ఏసీ నుంచి నీరు బయటకు వెళ్లే పైపు (Outer water pipe) కోసం గోడకు చేసిన రంధ్రం ద్వారా ఈ పాములు లోపలికి ప్రవేశించాయి. ఇంటి పైకప్పుపైకి చెట్ల కొమ్మలు వంగి ఉండటం వల్ల పాములు సులభంగా ఏసీ పైపుల వరకు చేరుకున్నాయి. అధికారులు గంటల తరబడి శ్రమించి నాలుగు పాములను పట్టుకోగా, ఐదవది పైపు ద్వారా బయటకు తప్పించుకుంది. పట్టుకున్న పాములను జనవాసాలు లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Leave a Reply