రాజధాని ఢిల్లీలోని మైదాన్గఢీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో, భోజనం కోసం డబ్బులు అడిగిన 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె సొంత కొడుకే కొట్టి చంపిన దారుణ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఖర్కక్ గ్రామానికి చెందిన సీతాదేవి అనే వృద్ధురాలు తన కొడుకుని భోజనం కొనడానికి కొంత చిల్లర డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మద్యం మత్తులో, తీవ్రమైన ఆవేశంలో ఉన్న ఆమె కొడుకు ఆమోద్, తల్లి అడిగిన దాన్ని కోపంతో తిరస్కరించి గొడవకు దిగాడు.
మాటల గొడవ తీవ్రమవ్వడంతో ఆవేశం కట్టలు తెంచుకున్న ఆ పాపి కొడుకు, కన్నతల్లిని తన్ని దారుణంగా దాడి చేయడమే కాకుండా వదలకుండా దగ్గర్లోనే ఉన్న సుత్తితో తలపై, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా బాదాడడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడిపోయిన వృద్ధురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలతో పోరాడుతుండగా, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులను కూడా ఆ వ్యక్తి చంపుతానని బెదిరించి నోళ్లు మూయించాడు. అంతేకాకుండా, హత్యను దాచే ఉద్దేశంతో వృద్ధురాలి మృతదేహాన్ని రాత్రికి రాత్రే వేరే ఎక్కడికైనా తీసుకెళ్లి పడేయాలని అతడు కుట్ర పన్నినట్లు విచారణలో తెలిసింది.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న మైదాన్గఢీ పోలీసులు వెంటనే హుటాహుటిన చేరుకుని, ప్రమాదకర స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని కాపాడి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీనితో క్లూస్ టీమ్ నిపుణుల సాయంతో పోలీసులు తీవ్ర విచారణను వేగవంతం చేయడంతో పాటు, పరారీలో ఉన్న దారుణ హంతకుడు ఆమోద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply