ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరుస్తుంటే, పాకిస్థాన్లో మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం దేశాలు ఒకదానితో ఒకటి ఎందుకు తలపడుతున్నాయి? అన్ని వైపులా ముస్లిం దేశాలకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి? అనే ప్రశ్నపై పాకిస్థానీ నిపుణుడు సాజిద్ తరార్ ఆసక్తికర విశ్లేషణ చేశారు.
ముస్లిం దేశాలు విద్యకు (తాలీమ్) దూరమవ్వడం, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడమే ఈ దుస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు.
చరిత్రలో చేసిన తప్పులే శాపమా?
“ప్రతిచోటా ముస్లింలే ఎందుకు చనిపోతున్నారు? వారు తమలో తామే ఎందుకు పోరాడుకుంటున్నారు?” అని అడిగిన ప్రశ్నకు సాజిద్ తరార్ ఇలా సమాధానమిచ్చారు:
- అణచివేత: “ముస్లిం పాలకులు సుదీర్ఘకాలం పాలించారు. ఆ సమయంలో వారు ఇతర జాతులపై, మతాలపై అణచివేతకు పాల్పడ్డారు. ఇందులో సందేహం లేదు, మీరు చరిత్ర చదివితే అది అర్థమవుతుంది.”
- సోమనాథ్ ఆలయం ప్రస్తావన: “ముస్లిం పాలకులు తాము సోమనాథ్ ఆలయాన్ని ఇస్లాం కోసం కొల్లగొట్టామని చెప్పుకునేవారు. కానీ వాస్తవానికి మీరు అక్కడ బంగారం దొంగిలించడానికి వెళ్లారు. ఆ బంగారాన్ని దోచుకుని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లారు. మతాన్ని కేవలం ఒక ముసుగులా వాడుకున్నారు.”
బలవంతపు మతమార్పిడులు వద్దు – క్యారెక్టర్ ముఖ్యం
మతమార్పిడుల గురించి మాట్లాడుతూ సాజిద్ తరార్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు:
- “మతమార్పిడి అనేది బలవంతంగా జరిగేది కాదు. మీ ప్రవర్తన (కిర్దార్) ఎంత బాగుండాలంటే, అది చూసి ఎదుటివారు ‘వీరి మతం ఎంత గొప్పదో కదా’ అని వారే స్వచ్ఛందంగా రావాలి.”
- ఒక ఉదాహరణ ఇస్తూ.. “ఒక పాకిస్థానీ యువకుడు బ్రిటన్ వెళ్తే, అక్కడ షరియా చట్టం అమలు కావాలని, లండన్ పేరును ‘ఇస్లామిస్తాన్’ గా మార్చాలని కోరుకుంటాడు. కానీ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడు.”
విద్య, వైద్యంపై నిర్లక్ష్యం
మధ్యప్రాచ్య దేశాల వెనుకబాటుతనానికి కారణాలను ఆయన ఇలా వివరించారు:
- టాప్ యూనివర్సిటీలు లేవు: “ముస్లిం దేశాలు విద్యకు దూరం జరిగాయి. అందుకే ఇరాన్ అంత సులభంగా లక్ష్యంగా మారింది. మధ్యప్రాచ్యంలో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక్కటైనా ప్రపంచ స్థాయి యూనివర్సిటీ ఉందా? లేదా చికిత్స చేయించుకోవడానికి ఒక అత్యుత్తమ ఆసుపత్రి ఉందా?”
- డబ్బు దుర్వినియోగం: “చమురు అమ్మి వేల కోట్లు సంపాదించారు. కానీ ఆ డబ్బును విద్య, వైద్యంపై ఎందుకు ఖర్చు చేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply