మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని పూచ్చిపట్టి ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతిలో చేరిన కొద్ది రోజులకే 16 ఏళ్ల విద్యార్థిని బడికి సరిగ్గా రావడం లేదని, టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్) తీసుకుని వెళ్లిపోవాలంటూ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్ఎం) విమలాదేవి ఆమె తల్లిదండ్రులను పిలిపించారు.
ఆ సమయంలో, తన తల్లి హెచ్ఎం ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడటం చూసిన ఆ విద్యార్థిని.. అలా ఎవరి ముందూ చేతులు కట్టుకుని నిలబడవద్దని తల్లికి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హెచ్ఎం, ఆ విద్యార్థినిని పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా ఏకవచనంతో తీవ్రంగా అవమానించారు. జరిగిన సంఘటనతో తీవ్ర మనస్తాపానికి, ఆత్మన్యూనతకు గురైన ఆ బాలిక, ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తాము దళిత సామాజిక వర్గానికి చెందినవారం కావడంతో కుల వివక్షతో హెచ్ఎం తమను కించపరిచినందువల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి ఇతరుల ముందు చేతులు కట్టుకుని నిలబడటాన్ని తట్టుకోలేక, ఉపాధ్యాయురాలి దూషణల భరించలేకే తమ బిడ్డ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, ఉసిలంపట్టి పోలీసులు హెచ్ఎం విమలాదేవిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply