ముంబై: మహారాష్ట్రలోని బద్లాపూర్ ప్రాంతంలో గుండెల్ని పిండేసే ఘోర ఉదంతం వెలుగుచూసింది. కారు పార్కింగ్లో నిలిపి ఉంచిన ఒక కారు నుండి దిగిన 4 ఏళ్ల చిన్నారి, సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి “అమ్మ చనిపోయింది” అని అమాయకంగా చెప్పాడు.
ఆ మాట విని షాక్కు గురైన బంధువులు వెంటనే కారు వైపు పరుగులు తీశారు. అక్కడ కారు లోపల సదరు బాలుడి తల్లి మనీషా భోస్లేతో పాటు కారు డ్రైవర్ ఇద్దరూ రక్తపు మడుగులో మృతదేహాలై పడి ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ను గణేష్ షిండేగా గుర్తించారు. బాలుడు ఇచ్చిన సమాచారం, ఘటనా స్థలంలోని పరిస్థితులను బట్టి.. డ్రైవర్ గణేష్ మొదట మనీషాను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత అదే ఆయుధంతో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
మొబైల్ డేటాపై పోలీసుల నిఘా: ఇదిలా ఉండగా, మరణించిన మనీషా బంధువులు తమకు ఈ డ్రైవర్ గణేష్ ఎవరో ముందే తెలియదని పోలీసులకు తెలిపారు. దీంతో మనీషాకు, డ్రైవర్కు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? లేదా ఏవైనా పాత పగలు ఉన్నాయా? అనే కోణంలో నిజాలను రాబట్టేందుకు పోలీసులు గణేష్ బంధువులను కూడా తీవ్రంగా విచారిస్తున్నారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వీరిద్దరి మొబైల్ ఫోన్ కాల్ డేటాను (CDR) పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు

Leave a Reply