ముంబై రైల్వే స్టేషన్లో ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఒక లోకల్ రైలు పైకప్పు (రూఫ్) పైకి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కాడు.
ట్రైన్ పైకప్పు పైకి ఎక్కిన ఆ వ్యక్తి, అక్కడ వెళ్తున్న 25,000 వోల్టుల హై-టెన్షన్ ఓవర్హెడ్ విద్యుత్ తీగల దగ్గరికి అత్యంత ప్రమాదకర రీతిలో వెళ్లాడు. అనుకోకుండా విద్యుత్ షాక్ బలంగా తాకడంతో, అతను తీవ్ర కాలిన గాయాలతో అక్కడికక్కడే ఎగిరిపడ్డాడు.
ఈ ఘోరాన్ని గమనించిన ఒక రైల్వే అధికారి క్షణాల్లో అప్రమత్తమై.. వెంటనే ఆ లైన్కు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు (పవర్ కట్ చేశారు). అనంతరం, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పైకప్పుపై ఉన్న బాధితుడిని కిందకు దించి రక్షించారు.
తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని వెంటనే సమీపంలోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి అత్యవసర విభాగంలో తీవ్ర చికిత్స అందిస్తున్నారు.
రైళ్ల పైకప్పులపై ఎక్కడం ప్రాణాలకే అత్యంత ప్రమాదకరమని, ప్రయాణికులు ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రమాదకర సాహసాలకు పాల్పడవద్దని రైల్వే అధికారులు గట్టిగా హెచ్చరించారు.
