మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లాలోని ఒక పాఠశాలలో దెయ్యం ఉందంటూ వ్యాపించిన పుకారు తీవ్ర సంచలనం సృష్టించింది.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న 300 మందికి పైగా విద్యార్థినులు భయంతో పాఠశాలను విడిచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. కొందరు విద్యార్థినులు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించారని, దానివల్ల మిగిలిన విద్యార్థినుల్లో భయం పెరిగిపోయిందని తెలుస్తోంది. రాత్రి వేళల్లో కొన్ని నిగూఢమైన శబ్దాలు వినిపించాయని కూడా వార్తలు వ్యాపించాయి.
ఈ ఘటన దాదాపు వారం రోజుల క్రితం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. హాస్టల్లో ఉంటున్న 15 మందికి పైగా విద్యార్థినులు హఠాత్తుగా గట్టిగా నవ్వడం, ఏడవడం చేశారని వెల్లడైంది. వారి ప్రవర్తనను చూసిన ఇతర విద్యార్థినులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రాత్రి వేళల్లో గజ్జెల శబ్దం వినిపిస్తోందని కొందరు చెప్పడంతో, పాఠశాలలో దెయ్యం ఉందనే పుకారు వేగంగా పాకింది.
పుకారు వ్యాపించడంతో విద్యార్థినుల్లో భయం మరింత హెచ్చైంది. దీంతో 300 మందికి పైగా విద్యార్థినులు హాస్టల్లో ఉండటానికి భయపడి తమ తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్ళిపోయారు. పాఠశాలలో ఆహారం వికటించి అనారోగ్యానికి గురైన ఘటన గతంలోనే జరగ్గా, ఇప్పుడు ఈ కొత్త పుకారు విద్యార్థినులను, తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
దీనిపై వైద్య అధికారులు పరిశీలించి, విద్యార్థినులకు దెయ్యం పట్టిందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కొందరు విద్యార్థినులు ఒకే సమయంలో భయం, తీవ్ర మానసిక ఒత్తిడి (మాస్ హిస్టీరియా) కారణంగా ఇలాంటి వింత లక్షణాలను వ్యక్తపరిచి ఉండవచ్చని పేర్కొన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన సంస్థలు, ఆరోగ్య శాఖ బృందాలు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులకు అవగాహన, కౌన్సిలింగ్ ఇస్తున్నాయి. దెయ్యం గురించిన పుకార్లను నమ్మవద్దని, విద్యార్థినుల భయాన్ని పోగొట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

Leave a Reply