గుజరాత్ రాష్ట్రంలోని వంజలియా – రణవావ్ మధ్య గల బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంలో ఊహించని అడ్డంకి కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆ ప్రాంతంలోని ఒక పెద్ద రైల్వే వంతెన పట్టాల మధ్య ఒక ఒంటె ఇరుక్కుపోయి బయటకు రాలేక విలవిల్లాడింది. అదే సమయంలో ముంబై (దాదర్) నుంచి పోర్బందర్ వెళ్తున్న ‘సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్’ (రైలు నం. 19015) లోకో పైలట్.. పట్టాలపై ఒంటె ఇరుక్కుని ఉండటాన్ని చాలా దూరం నుంచే గమనించారు.
వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. అనంతరం ఆయన రైల్వే ఉన్నతాధికారులకు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వంతెన పట్టాల ఇరుకు సందుల్లో ఆ మూగజీవం ఇరుక్కుపోవడంతో, దానిని సురక్షితంగా రక్షించేందుకు ప్రత్యేక క్రేన్లను రప్పించి ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సంఘటన కారణంగా పోర్బందర్ వైపు వెళ్లే పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను సమీప స్టేషన్లలోనే తాత్కాలికంగా నిలిపివేశారు. రెస్క్యూ సిబ్బంది నిరంతర శ్రమతో ఒంటెను సురక్షితంగా బయటకు తీసి, రైల్వే ట్రాక్ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్లపైకి మూగజీవాలు రావడం, వాటి భద్రతకు సంబంధించి ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Leave a Reply