తీవ్ర వరదలు, కొండచరియలు విరిగిపడి సర్వస్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సాయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
ముఖ్యంగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘స్ట్రే కిడ్స్’ (Stray Kids) బ్యాండ్కు చెందిన ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ లీ నో (Lee Know), నేపాల్లో విపత్తు సహాయక చర్యల కోసం తన సొంత నిధుల నుంచి భారీ విరాళాన్ని అందజేశారు. దక్షిణ కొరియా కరెన్సీ ప్రకారం 100 మిలియన్ వోన్ (Won) మొత్తాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.69 లక్షలకు పైమాటే. బాధితులు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన తన ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ భారీ ఆర్థిక సాయాన్ని ఆయన ‘వరల్డ్ విజన్’ (World Vision) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేపాల్కు పంపించారు. సంగీతం ద్వారా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈయన, ఇలాంటి మానవతా, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండటం అలవాటుగా చేసుకున్నారు. గతంలోనూ ఆకలితో అలమటించే దేశాలకు, పేద చిన్నారుల సంక్షేమానికి కోట్లాది రూపాయల ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్న ఆయనను ప్రస్తుతం నెటిజన్లు విస్తృతంగా ప్రశంసిస్తున్నారు.
మరోవైపు, నేపాల్లో సంభవించిన ఈ ఘోర ప్రకృతి విపత్తును చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా కన్నీటిపర్యంతమై ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత దేశం ప్రస్తుత దుస్థితిని చూసి కలత చెందిన ఆమె, సరిహద్దు దేశాలైన భారత్, చైనాలు నేపాల్కు అవసరమైన అత్యవసర సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్తో సహా పలువురు ఆధ్యాత్మిక వేత్తలు కూడా నేపాల్ ప్రధాని సహాయ నిధికి తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ప్రపంచ దేశాల నుంచి నేపాల్కు నిరంతరం ఆసరా లభిస్తుండటం అక్కడి బాధితులకు కాస్త ఊరటనిస్తోంది.

Leave a Reply