స్టాక్హోమ్: స్వీడన్లో గత కొన్నేళ్లుగా భార్యను బెదిరిస్తూ, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించినట్లు రుజువైన కేసులో 61 ఏళ్ల వ్యక్తికి అక్కడి జిల్లా కోర్టు 4 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
బాధిత మహిళ అంతటి నిఘా నీడ నుండి కూడా అత్యంత రహస్యంగా పోలీసులను సంప్రదించి ప్రాణాలతో తప్పించుకున్న తీరు ప్రస్తుతం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బంధించి, నియంత్రించిన భర్త
స్వీడన్లోని క్రామ్ఫోర్స్ ప్రాంతంలో ఉన్న ఒక ఒంటరి ఫామ్హౌస్లో 2022 నుండి ఈ దారుణాలు సాగుతున్నట్లు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది. సమాచారం ప్రకారం.. నిందితుడు తన భార్యను సమాజంతో, బంధువులతో ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్తిగా వేరు చేసి ఒకే గదికి పరిమితం చేశాడు. అంతేకాకుండా, ఆమెకు నిరంతరం మత్తు మందులు (డ్రగ్స్) ఇస్తూ ఆమె జీవితాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్నాడు.
దీనికి తోడు ఇల్లంతా సీసీటీవీ (CCTV) కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆమె ప్రతి కదలికను క్షణక్షణం గమనిస్తూ వచ్చాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరిస్తూ.. ఇప్పటివరకు 120 మందికి పైగా పురుషులతో బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి.
రహస్య సమాచారంతో వెలుగులోకి..
అక్టోబర్ 2025లో, ఇంట్లో కెమెరాలు రికార్డ్ చేయలేని ఒక రహస్య ప్రాంతాన్ని (బ్లైండ్ స్పాట్) ఉపయోగించుకుని ఆ మహిళ అత్యవసర సహాయ కేంద్రానికి (ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు) రహస్యంగా సమాచారం పంపింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సదరు ఫామ్హౌస్పై దాడి చేసి ఆమెను సురక్షితంగా రక్షించారు.
కోర్టు విచారణ సమయంలో.. ఇదంతా పరస్పర అంగీకారంతోనే జరిగిందని నిందితుడు వాదించాడు. అయితే, సాక్ష్యాలను మరియు నిఘా ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. లైంగిక దోపిడీ, తీవ్రమైన గృహహింస మరియు వేధింపుల కింద అతడిని నేరస్థుడిగా ప్రకటించింది.
వినియోగదారులకు (కస్టమర్లకు) కూడా శిక్ష
తీర్పులో భాగంగా బాధిత మహిళకు నష్టపరిహారంగా 2 లక్షల స్వీడిష్ క్రోనా (సుమారు రూ. 16 లక్షల పైమాటే) చెల్లించాలని కోర్టు నిందితుడిని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ అక్రమ వ్యభిచార కేసుతో సంబంధం ఉన్న 29 మంది కస్టమర్లలో 28 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. వారికి కూడా జైలు శిక్షతో పాటు కఠినమైన జరిమానాలు విధించింది.
భర్త ఏర్పాటు చేసిన కఠినమైన నిఘా వలయాన్ని, ప్రాణభయాన్ని అధిగమించి అధికారులకు సమాచారం అందించిన ఆ మహిళ ధైర్యాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు. మహిళల భద్రత మరియు కుటుంబ సభ్యుల ద్వారానే జరిగే ఇలాంటి అదృశ్య బంధనాలపై ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చకు తెరలేపింది.
