కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో డ్రైవర్గా పనిచేసిన పాల్ కురియన్ రిటైర్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇడుక్కి జిల్లా కుమిలి డిపోలో సెప్టెంబర్ 2వ తేదీన ఆయన తన చివరి డ్యూటీని పూర్తి చేశారు. ఏళ్ల తరబడి తన ప్రయాణంలో తోడుగా నిలిచిన బస్సును విడిచిపెట్టడానికి మనసొప్పక ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డ్రైవర్కు, తన వాహనానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చాటేలా ఈ హృదయ విదారక దృశ్యం నిలిచింది.
చివరి డ్యూటీ ముగించిన అనంతరం పాల్ కురియన్ బస్సు వద్దకు వెళ్లి భావోద్వేగంతో దాని స్టీరింగ్ను ముద్దాడారు. ఆ తర్వాత బస్సు నాలుగు టైర్లను తాకి నమస్కరించి, వాహనానికి గౌరవ సూచకంగా సెల్యూట్ చేశారు. ఎండనక, వాననక ఏళ్ల తరబడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ బస్సును నడిపిన ఆయన, దానికి వీడ్కోలు పలికే క్షణంలో కన్నీటి పర్యంతమయ్యారు. బస్సును గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన ఉద్యోగ కాలంలో ఈ బస్సు ద్వారా ఎంతోమంది ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, తన కుటుంబ జీవనాధారానికి కూడా ఈ కొలువే ప్రధాన ఆధారంగా నిలిచింది. దీంతో పదవీ విరమణ రోజున బస్సుపై ఆయన చూపించిన ప్రేమానురాగాలు చూసే ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. వాహనం అనేది కేవలం ఇనుము, టైర్లతో కూడిన యంత్రం మాత్రమే కాదని; తన జీవిత ప్రయాణంలో భాగమైన ఒక తోడు అనే విషయాన్ని ఆయన ప్రవర్తన తెలియజేసిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో, పాల్ కురియన్ కర్తవ్య నిష్టను, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. మన జీవనోపాధిని అందించిన వస్తువులను, వృత్తిని మనస్ఫూర్తిగా గౌరవించాలనడానికి ఈ దృశ్యమే గొప్ప నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తనతో ప్రయాణించిన బస్సుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఇచ్చిన వీడ్కోలు చూసేవారి హృదయాలను హత్తుకుంటోంది.

Leave a Reply