చైనా దేశంలో తీవ్రరూపం దాల్చుతున్న నిరుద్యోగ సమస్య కారణంగా యువత వింత పోకడలను ఆశ్రయిస్తోంది. తమకు ఎలాంటి జీతం రాకపోయినా సరే.. ఆఫీస్ వాతావరణం కావాలంటూ తమ సొంత జేబులోంచి డబ్బులు చెల్లించి రెంట్ ఆఫీసులకు (Co-working Spaces) వెళ్లే కొత్త సంస్కృతికి అక్కడి యువత తెరతీసింది.
‘ప్రిటెండ్ టు వర్క్’ (Pretend to Work – ఉద్యోగం చేస్తున్నట్లు నటించడం) పేరుతో ప్రాచుర్యం పొందుతున్న ఈ సరికొత్త ట్రెండ్లో భాగంగా జెన్-జీ (Gen-Z) తరానికి చెందిన నిరుద్యోగ యువతీయువకులు ల్యాప్టాప్లతో వచ్చి కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, తమ సొంత ప్రాజెక్టులపై పనిచేయడం వంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఇలాంటి రెంటల్ ఆఫీసుల్లో రోజంతా కూర్చుని పనిచేయడానికి యువత ప్రతిరోజూ తమ సొంత జేబుల నుంచి సుమారు 30 నుంచి 50 యువాన్లు (సుమారు రూ. 400 నుంచి రూ. 670కి పైగా) చెల్లిస్తున్నారు. దీనివల్ల ఏడాదికి పెద్ద మొత్తంలోనే ఖర్చవుతున్నప్పటికీ.. ఇంట్లోనే ఉంటూ ఒంటరితనంతో కుంగిపోవడం కంటే ఇలాంటి ఆఫీస్ వాతావరణంలో ఉండటమే తమకు మానసిక స్థైర్యాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని వారు చెబుతున్నారు.
నాన్జింగ్, షాంఘై, వుహాన్ మరియు షెంజెన్ వంటి చైనాలోని ప్రధాన నగరాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ఈ విచిత్ర పరిస్థితి.. అక్కడి యువతలో నెలకొన్న తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభానికి అద్దం పడుతోంది. అధికారిక లెక్కలకు మించి, పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల అధ్యయనాలు కూడా అక్కడి యువత భవిష్యత్తుపై ఉన్న సవాళ్లను హెచ్చరిస్తుండటంతో ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply