రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వెలుగు చూసిన దృశ్యాలు యావత్ విద్యావ్యవస్థను తలదన్నేలా చేశాయి.
చదువుకోవాల్సిన పసిపిల్లలతో ఇళ్ల పనులు, వంటగది పనులు చేయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
జోధ్పూర్ జిల్లా లూనీ నియోజకవర్గ పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్కడి చిన్నారులను పాఠశాల వంటపనులకు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక చిన్నారి బాలుడు పాఠశాల వంటగదిలో చాలా పెద్ద పెద్ద గిన్నెలను ఎంతో కష్టపడి తోముతున్నాడు.
మరో చిన్నారి బాలిక చేతిలో చీపురు పట్టుకుని తరగతి గదిని, ప్రాంగణాన్ని ఊడ్చే పనిలో నిమగ్నమై ఉంది. చేతిలో పుస్తకాలు, చదువు ఉండాల్సిన ఆ పసిప్రాయపు చేతుల్లో గిన్నెలు, చీపుర్లు పెట్టిన ఈ దుర్మార్గాన్ని అక్కడే ఉన్న ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడి ముందే ఈ దారుణం జరిగిందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన విద్య అందుతున్నాయనే ప్రకటనలన్నీ ఈ ఘటనతో ప్రశ్నార్థకమయ్యాయి.
ఈ సమాచారం, వైరల్ వీడియో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. పసిపిల్లలతో కొన్నేళ్ల నాటి బానిస పద్ధతిలో పనులు చేయించిన ఆ పాఠశాల యాజమాన్యంపై, బాధ్యతలేని ఉపాధ్యాయులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply