సోషల్ మీడియాలో దొంగలు దొరికితే జనం చితక్కొట్టే వీడియోలు ఎన్నో చూసుంటాం. కానీ నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్న ఒక వీడియో.. పల్లెటూరి జనం అమాయకత్వాన్ని, వారిలోని సహజసిద్ధమైన మానవత్వాన్ని చాటిచెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
బీహార్లోని ఓ గ్రామంలో దొంగతనానికి వచ్చిన దొంగను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే అతడిని చితకబాదడం పక్కనపెట్టి, కడుపునిండా కూరలతో అన్నం వడ్డించి ఆప్యాయంగా తినిపించారు. అన్నం తిన్న తర్వాత ఎక్కడ తంతారో అన్న భయంతో, ఆ దొంగ కళ్లనిండా నీళ్లు నింపుకుని ఏడుస్తూనే తింటున్న దృశ్యాలు చూసేవారికి నవ్వు తెప్పిస్తున్నాయి.
ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి అక్కడున్న ఒక పెద్దాయనను ఉద్దేశించి.. “దొంగను పట్టుకుని కొట్టకుండా ఇలా రాచమర్యాదలు చేసి భోజనం పెడుతున్నారేంటి తాతా?” అని అడిగాడు. దానికి ఆ తాత స్పందిస్తూ.. “ఒరేయ్… ఆకలితో వీడు ఏమైనా అయిపోతే ఎవరు సమాధానం చెబుతారురా? ప్రాణం పోయేదాకా ఆకలితో మాడ్చేయగలమా ఏంటి?” అంటూ చాలా సింపుల్గా బదులిచ్చాడు.
“ముందు కడుపునిండా తిండి పెడతాం.. ఆ తర్వాత పంచాయితీ సంగతి చూస్తాం” అంటూ గ్రామస్థులు సరదాగా మాట్లాడిన ఈ ఆత్మీయ వీడియో ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 28 వేలకు పైగా వ్యూస్తో విపరీతంగా వైరల్ అవుతోంది.
