ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో 26 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన కేసులో ప్రముఖ ఆసుపత్రి యజమాని దేవ్ కాంత్ ఉత్తమ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగింది? బాధితురాలు తన తల్లితో కలిసి కాన్పూర్లో ఉంటూ ఎస్సై (దరోగా) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హాస్పిటల్ యజమాని దేవ్ కాంత్ ఉత్తమ్ ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. మధ్యప్రదేశ్కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో, బలవంతంగా అబార్షన్ చేయించాడు. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా, అతను ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆగ్రహించిన దేవ్ కాంత్ తన బంధువు మరియు సెక్యూరిటీ గార్డు సాయంతో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
శవం ఎక్కడ దొరికింది? హత్య చేసిన తర్వాత, నిందితులు శవాన్ని కాన్పూర్ నుండి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న బులాంద్షహర్లో దుస్తులు లేకుండా పడేశారు. అప్పటికే ఆ శవం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులు దహన సంస్కారాలు చేశారు. యువతి కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి కలావా (చేతి దారం) మరియు ముక్కు పుడక ఆధారంగా ఆమె మృతదేహాన్ని తల్లి గుర్తించింది.
నిందితుల అరెస్టు: నిందితుడు దేవ్ కాంత్ తనను తాను పదునైన వస్తువుతో గాయపరచుకుని ఆసుపత్రిలో చేరాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని బంధువు వివేక్ పటేల్ మరియు సెక్యూరిటీ గార్డు అజిత్ సింగ్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో నిందితుడు తాను రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నానని, బీజేపీ కార్యకర్తనని కూడా వెల్లడైంది.
