విక్టోరియా: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన వార్తపై స్కై న్యూస్ ఆస్ట్రేలియా యాంకర్ రీటా పనాహి అత్యంత కటువైన పదజాలంతో స్పందించారు.
చిన్నతనంలోనే ఇరాన్ నుండి పారిపోవాల్సి వచ్చిన పనాహి, లైవ్ బ్రాడ్కాస్ట్లో ఇలా అన్నారు: “47 ఏళ్ల ఇస్లామిస్ట్ నియంతృత్వం తర్వాత, ఆ నియంత మరణించాడు. ఇరాన్ ఇప్పుడు విముక్తి పథంలో ఉంది. నా జీవితకాలంలో ఇలాంటి రోజు చూస్తానని అనుకోలేదు.” ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో క్షిపణి దాడికి సాహసించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆమె ప్రశంసించారు.
ఇరాన్లో మిశ్రమ స్పందన; రీటా భావోద్వేగం: 36 ఏళ్ల పాటు ఇరాన్ను పాలించిన ఖమేనీ మరణంపై ఇరాన్లో ఒక వర్గం దుఃఖిస్తుంటే, మరో వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఖమేనీ మరణ వార్తను ధృవీకరించే సమయంలో ఇరాన్ వార్తా యాంకర్లు ప్రత్యక్ష ప్రసారంలో కన్నీరు పెట్టుకున్నారు.
అయితే, ప్రభుత్వ వేధింపుల భయంతో ఏళ్ల తరబడి ఇరాన్కు వెళ్లలేకపోయిన పనాహి, పర్షియన్ భాషలో ఖమేనీని తీవ్రంగా విమర్శించారు. ఆమె మాటలకు అర్థం: “నీ తండ్రి ఒక కుక్క, నీ తలపై మట్టి పడాలి (ఛీత్కారం), నువ్వు నరకంలో కాలిపోవాలి.” పనాహికి ఈ వార్త ఎంత వ్యక్తిగతమైనదో ఆమె తోటి యాంకర్ రోవాన్ డీన్ గుర్తుచేశారు. ఎక్స్ (X) వేదికగా ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.
అంతర్జాతీయ స్పందన: ఖమేనీ మరణాన్ని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్, అతడిని “చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకడు” అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో వేలాది లక్ష్యాలను ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అయితే, రష్యా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పుతిన్ దీనిని “అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన”గా పేర్కొంటూ ఖమేనీ కుటుంబానికి సంతాపం తెలిపారు.

Leave a Reply