మహారాష్ట్రలోని ధారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లా నల్దుర్గ్ కోట బురుజు పైనుంచి తల్లీ, ఆమె ముగ్గురు కుమార్తెలు కిందకు దూకేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ విషాదకర ఘటనలో తల్లితో పాటు ఒక కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.
ధారాశివ్ జిల్లా ఉమర్గా తాలూకా వండల్ గ్రామానికి చెందిన అశ్విని భోసలే (30) అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి నల్దుర్గ్లోని భుయ్కోట్ కోట ఎత్తైన బురుజుపైకి చేరుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నలుగురూ అక్కడి నుంచి కిందకు దూకేసినట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
సమాచారం అందిన వెంటనే నల్దుర్గ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాలికలకు ప్రస్తుతం ధారాశివ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
ఈ దుర్ఘటనకు గల అసలు కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆ తల్లి ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై నల్దుర్గ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుల శరీరాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

Leave a Reply