పాఠశాలల్లో చదివే విద్యార్థినులు క్లాసుల్లో సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడానికి, ఎప్పుడూ అలసటగా ఉండటానికి చదువుల ఒత్తిడి మాత్రమే కారణం కాదు.
పీరియడ్స్ (రుతుక్రమం) సమయంలో అధిక రక్తస్రావం కావడం, దానివల్ల శరీరంలో ఏర్పడే ఐరన్ (ఇనుము) లోపమే దీనికి ప్రధాన కారణం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కౌమార దశలో (టీనేజ్) శారీరక ఎదుగుదల వేగంగా ఉండటం వల్ల శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వరుసగా 7 రోజులకు పైగా రక్తస్రావం కావడం, ప్రతి 1-2 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చాల్సి రావడం వంటి అధిక రక్తస్రావం జరిగినప్పుడు శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది.
హార్మోన్ల అసమతుల్యత లేదా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో లోపాల కారణంగా బాలికలలో అధిక రక్తస్రావం సమస్య రావచ్చు. దీనివల్ల ఏర్పడే ఐరన్ లోపం మెదడు పనితీరుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, తలనొప్పి మరియు తీవ్రమైన నీరసానికి దారితీస్తుంది.
కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల అలసటను కేవలం “బద్ధకం” లేదా “పరీక్షల భయం” అని కొట్టిపారేయకూడదు. పీరియడ్స్ సమయంలో పిల్లల్లో అధిక అలసట, తలతిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది నిశితంగా గమనించడం ఎంతో ముఖ్యం.
సొంత వైద్యం చేసుకోవడం లేదా ఇష్టానుసారంగా ఐరన్ మాత్రలు వేసుకోవడం మానేసి, వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించాలి. సరైన సమయంలో సమస్యను గుర్తించి చికిత్స అందించడం వల్ల విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా చదువులో వారి ప్రతిభను కూడా మెరుగుపరచవచ్చు.

Leave a Reply