బాగల్కోట్: కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో తీవ్ర విషాదంతో కూడిన ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నీటి ట్యాంకులో మునిగి ప్రాణాలు కోల్పోయిన తమ కన్నకూతురు మళ్లీ బతుకుతుందనే ఆశతో.. ఆ చిన్నారి మృతదేహాన్ని ఉప్పు కుప్పలో పూడ్చిపెట్టి, చెవిలో ఖురాన్ ప్రార్థనలు వినిపిస్తూ తల్లిదండ్రులు రెండు గంటల పాటు ఆసుపత్రి వెలుపల నిరీక్షించారు.
అసలేం జరిగిందంటే..?
అమీనా అనే చిన్నారి ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు సమీపంలోని ఒక ఇంటి నీటి ట్యాంకులో పడిపోయింది. ఊపిరాడకపోవడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే పరితాపంగా ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న నవనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మూఢనమ్మకంతో రెండు గంటల పాటు ప్రార్థనలు
కళ్లముందే ఆడుతూ పాడుతూ ఉన్న బిడ్డ శవంగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు, బంధువులు తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే వారు ఒక వింత మూఢనమ్మకాన్ని ఆశ్రయించారు. నీటిలో మునిగి చనిపోయిన వారిని ఉప్పులో పూడ్చిపెడితే మళ్లీ ప్రాణాలు వస్తాయని ఎవరో చెప్పిన మాటలను వారు నమ్మారు.
దీంతో ఆసుపత్రి పోస్ట్మార్టం గది వెలుపలే చిన్నారి ముఖం ఒక్కటే బయటకు కనిపించేలా, మిగిలిన శరీరమంతటినీ ఉప్పులో కప్పెట్టారు. అంతటితో ఆగకుండా, తమ మొబైల్ ఫోన్లో ఖురాన్ ప్రార్థనలను ప్లే చేసి, ఆ ఫోన్ను చిన్నారి చెవి దగ్గర ఉంచి సుమారు రెండు గంటలకు పైగా భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు.
వైద్యుల ఎంట్రీ.. నిరాశలో తల్లిదండ్రులు
అయితే, ఎంతసేపటికీ శరీరంలో ఎలాంటి చలనం గానీ, అద్భుతం గానీ జరగకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు, వైద్యులు ఆ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, ప్రాణం పోయాక ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వివరించారు. అనంతరం మృతదేహాన్ని ఉప్పు నుండి బయటకు తీసి, పోస్ట్మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వైద్యుల కీలక విజ్ఞప్తి:
ఎవరైనా నీటిలో మునిగి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు.. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి సమయాన్ని వృధా చేయవద్దని వైద్యులు ప్రజలను కోరారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స (First-Aid) అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని వారు హితవు పలికారు.

Leave a Reply