జపాన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన ఒక భారతీయ మహిళ తన విలువైన వస్తువులు పోయిన క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన, మరపురాని అనుభవాన్ని ఎదుర్కొంది.
తాను బస చేసిన గది తాళాలు, ఖరీదైన మైక్రోఫోన్ మరియు దాదాపు లక్ష రూపాయల (భారత కరెన్సీ) నగదు ఉన్న తన హ్యాండ్బ్యాగ్ను అనుకోకుండా ఒక సైకిల్ బుట్టలోనే మరిచిపోయి వెళ్లిపోయింది.
కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ కనిపించలేదని గుర్తించిన ఆ మహిళ, ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకోవాలనే చిన్న ఆశతో వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ను (కోబన్) ఆశ్రయించింది. అక్కడ పోలీసులకు తన బ్యాగ్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న వస్తువులేంటి అనే పూర్తి వివరాలను అందించింది.
ఆమె చెప్పిన వివరాలను విన్న పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే ఒక గుర్తుతెలియని వ్యక్తి అలాంటి బ్యాగ్ను తీసుకొచ్చి స్టేషన్లో అప్పగించారని చెబుతూ దాన్ని ఆమెకు చూపించారు. ఆ బ్యాగ్ను తెరిచి చూసిన ఆ మహిళ.. అందులో ఉన్న చిన్న కార్డు లేదా ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ప్రతి వస్తువు భద్రంగా ఉండటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి చూపించిన ఈ నిఖార్సయిన నిజాయితీని చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆపద సమయంలో నిస్వార్థంగా సాయం చేసిన ఆ వ్యక్తి మంచి మనసును, జపాన్ దేశ ప్రజల ఉన్నతమైన సంస్కృతిని కొనియాడుతూ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
సోషల్ మీడియాలో ఈ అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్న ఆమె.. విదేశీ గడ్డపై తనకు ఎదురైన ఈ అనుభవం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని పేర్కొంది. అంతేకాకుండా, జపాన్ ప్రజల నిజాయితీని, మానవతా దృక్పథాన్ని నెటిజన్లు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply