రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో కుటుంబ సమస్యల నుంచి తప్పించుకుని జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో, రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను దొంగిలించిన మహిళను ప్రజలు వెంబడించి పట్టుకున్న విచిత్ర ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
జైపూర్ నివారూ రోడ్లోని ‘భవాని జ్యువెల్లర్స్’ దుకాణానికి కస్టమర్లా వచ్చిన ఓ మధ్య వయస్కురాలైన మహిళ, బంగారు ఉంగరాలు చూపించాలని అడిగింది. సిబ్బంది నగల పెట్టెను ఆమె ముందు ఉంచగా, వారు అటు ఇటు చూసిన సమయం చూసి.. రూ. 20 లక్షల విలువైన 25 బంగారు ఉంగరాలు ఉన్న పెట్టెతో ఆ మహిళ అక్కడి నుంచి పరారైంది.
ఇది చూసి షాక్కు గురైన దుకాణ యజమాని త్రిలోక్ చంద్ మరియు సిబ్బంది “దొంగ.. దొంగ..” అంటూ అరుస్తూ వీధిలోకి వెంబడించారు. వారి అరుపులు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు కూడా వారితో కలిసి, సుమారు 500 మీటర్ల దూరం వెంబడించి ఆ మహిళను పట్టుకున్నారు.
పట్టుబడిన మహిళ వద్ద నుంచి నగల పెట్టెను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె వద్ద ఉన్న కారం పొడి, స్ప్రే బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా, ఆమె ఇచ్చిన వాంగ్మూలం విని అధికారులే అవాక్కయ్యారు.
“కుటుంబ సమస్యల వల్ల తీవ్ర మనశ్శాంతి కరువైంది; జైలుకు వెళితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ దొంగతనం చేశాను” అని ఆ మహిళ ఎలాంటి భయం, ఆందోళన లేకుండా చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply