మార్కెట్లో బాటిళ్లో లభించే మ్యాంగో జ్యూస్ (మామిడి పండ్ల రసం)లను అమితంగా ఇష్టపడుతూ తాగే వారికి కనువిప్పు కలిగించేలా.. డాక్టర్ ఐజాక్ అనే వైద్యుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక షాకింగ్ అవగాహన వీడియోను పంచుకున్నారు.
ఆ వీడియోలో, కమర్షియల్గా మార్కెట్లలో విక్రయించే మ్యాంగో జ్యూస్ తయారీ విధానం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన బయటపెట్టారు. జ్యూస్ తయారీ కోసం మొదట నీటిలో కలరింగ్ పౌడర్ (రంగుల పొడి) మరియు కెమికల్ లిక్విడ్స్ను కలుపుతారు. ఆ తర్వాత అది మంచి సువాసన రావడానికి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం (షెల్ఫ్ లైఫ్) కోసం రకరకాల ప్రిజర్వేటివ్లను జోడిస్తారు.
కేవలం ఒక బకెట్ పండ్ల రసం.. 50 కిలోల చక్కెర!
ఆపై, కేవలం ఒక బకెట్ పరిమాణంలో ఉన్న అసలైన మామిడి రసానికి, ఏకంగా సుమారు 50 కిలోల మేర చక్కెరను (షుగర్) కుమ్మరిస్తారు. మొత్తంగా చూస్తే, మనం తాగే బాటిల్ జ్యూస్లలో సహజమైన మామిడి పండ్ల రసం శాతం కేవలం 15% మాత్రమే ఉంటుందని ఆ వైద్యుడు సంచలన నిజాన్ని బద్దలు కొట్టారు.
చిన్న వయసులోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు..
మిగిలినదంతా శరీరానికి తీవ్ర హాని కలిగించే ప్రిజర్వేటివ్లు, చక్కెర మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిని నిరంతరం తాగడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా చిన్న వయసులోనే మధుమేహం (షుగర్ వ్యాధి), చర్మ సమస్యలు, పంటి నొప్పి, ఊబకాయం మరియు కాలేయ వాపు (లివర్ ఇన్ఫెక్షన్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
ఇలాంటి ప్రమాదకరమైన రసాయన మిశ్రమాలను (కెమికల్ కాక్టైల్స్) డబ్బులు పెట్టి కొని తాగడానికి బదులుగా.. నేరుగా ప్రకృతిసిద్ధంగా దొరికే పండ్లను కొనుగోలు చేసి, ఇంట్లోనే కోసుకుని తినడం ఎంతో ఉత్తమమని ఆయన ప్రజలకు ఆరోగ్యకరమైన సలహా ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో, ప్యాక్డ్ జ్యూస్ ప్రియులలో పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply