అంబికాపూర్ (ఛత్తీస్గఢ్): మద్యం అలవాటును మానుకోవాలని మందలించినందుకు, ఒక 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపి, మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు బయటకు వెళ్లి బిర్యానీ తిని, వచ్చి నిద్రపోయాడు.
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో సోమవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. నిందితుడు ప్రభాత్ కెర్కెట్టా అలియాస్ లేడాను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కోపంలో “పొరపాటున” ఈ హత్య జరిగిందని అతను చెప్పుకొచ్చాడు.
ఘటన వివరాలు:
పోలీసుల కథనం ప్రకారం, ప్రభాత్ తండ్రి పారస్ కెర్కెట్టా (50) బహేరాపారాలో ఒంటరిగా నివసిస్తుండగా, ప్రభాత్ సమీపంలోనే అద్దెకు ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రభాత్ మద్యం మత్తులో తండ్రి ఇంటికి వెళ్లాడు. కొడుకు తాగుడు అలవాటుపై పారస్ అభ్యంతరం తెలపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాత్, ఇంట్లోని గొడ్డలితో తండ్రి తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
హత్య అనంతరం, ప్రభాత్ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ఇంటి సమీపంలోని చిన్న వాటర్ ట్యాంక్లో పడేశాడు. ఆపై సమీపంలోని దుకాణానికి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిని, ఇంటికి వచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం పారస్ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై స్టేషన్ ఇన్-ఛార్జ్ సీపీ తివారీ మాట్లాడుతూ, “నిందితుడిని అరెస్ట్ చేశాం, విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు. కొద్దిరోజుల క్రితం లక్నోలో కూడా ఒక యువకుడు తన తండ్రిని చంపి ముక్కలు చేసిన ఘటన మరువక ముందే, ఇలాంటిదే మరో దారుణం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

Leave a Reply