రాయ్బరేలీ: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఇంట్లో తన తల్లితో కలిసి నిద్రిస్తున్న ఒక యువతికి ఊహించని దారుణం ఎదురైంది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు. ఆ యువకుడు మరెవరో కాదు.. ఆ యువతిని ఏకపక్షంగా (వన్ సైడ్ లవ్) ప్రేమిస్తూ, వేధింపులకు గురిచేస్తున్న ఒక రోమియో.
ఆ యువకుడి వికృత చేష్టల వల్ల సదరు యువతి గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళన చెందుతోంది. ఆ యువతి ఎక్కడికి వెళ్లినా ఆ యువకుడు ఆమె వెనకాలే వస్తూ వేధించేవాడు. అయితే శుక్రవారం రాత్రి అతడు అన్ని హద్దులు దాటేశాడు. రాత్రి వేళ తన తల్లితో కలిసి పడుకున్న యువతిని లక్ష్యంగా చేసుకుని, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీనిని యువతి తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అడ్డువచ్చిన ఆమె తల్లి, సోదరుడిపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. “గత రాత్రి నేను నా తల్లితో కలిసి ఇంట్లో పడుకున్నాను. అప్పుడు రాత్రి సుమారు 9 గంటల సమయంలో, నాపై ఏకపక్ష ప్రేమతో పిచ్చెక్కిన సదరు యువకుడు తన స్నేహితుడితో కలిసి మా ఇంట్లోకి చొరబడ్డాడు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేను గట్టిగా అరుస్తూ నిరసన తెలపడంతో నా కేకలు విని నా తల్లి, సోదరుడు నిద్రలేచారు. నా కుటుంబ సభ్యులు అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆ యువకుడు వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు” అని పేర్కొంది. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అక్కడి నుండి పరారయ్యాడు. ఆ యువకుడు తనను వన్-సైడ్ ప్రేమిస్తున్నాడని, తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు శనివారం నాడు కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు కొత్వాల్ సంజయ్ కుమార్ తెలిపారు.

Leave a Reply