ఆహారం తిన్న తర్వాత కడుపులో నొప్పి రావడం, కడుపు బరువుగా అనిపించడం లేదా తిమ్మిరి (కడుపు పట్టేసినట్లు) ఉండటం చాలామందిలో అప్పుడప్పుడు కనిపించే ఒక సాధారణ సమస్య.
దీనికి గ్యాస్ సమస్య, మలబద్ధకం, ఎసిడిటీ (ఆమ్లతత్వం), మితిమీరి తినడం లేదా కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం (ఫుడ్ అలర్జీలు) వంటివి కారణం కావొచ్చు. కాబట్టి, తిన్న వెంటనే కడుపునొప్పి వచ్చినంత మాత్రాన అది పెద్దపేగు క్యాన్సర్ అని ముందస్తుగా నిర్ధారించుకోకూడదు.
కానీ కడుపునొప్పి మళ్లీ మళ్లీ పదేపదే వస్తుంటే, దాన్ని కేవలం గ్యాస్ సమస్యగానే భావించి అలసత్వం ప్రదర్శించకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా నొప్పి ఎప్పుడు మొదలవుతోంది, తిన్న ఎంతసేపటి తర్వాత వస్తోంది, ఎంతకాలంగా ఈ సమస్య ఉంది, కుటుంబంలో ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ చరిత్ర ఉందా వంటి అంశాలను వైద్యులు పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి మల పరీక్ష (స్టూల్ టెస్ట్), రక్త పరీక్షలతో సహా ఇతర వైద్య పరీక్షలను కూడా సూచించవచ్చు.
పెద్దపేగు క్యాన్సర్కు సంబంధించినవిగా ఉండదగ్గ కొన్ని ప్రధాన లక్షణాలలో.. మలంలో రక్తం పడటం, దీర్ఘకాలిక మలబద్ధకం లేదా విరేచనాలు, ప్రేగు కదలికలలో (మలవిసర్జన అలవాట్లలో) ఆకస్మిక మార్పు, పొత్తికడుపు తిమ్మిరి లేదా కడుపు ఉబ్బరం, స్పష్టమైన కారణం లేకుండానే శరీర బరువు తగ్గడం, నిరంతర అలసట వంటివి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ అని అర్థం కాదు; ఇతర జీర్ణకోశ సమస్యల వల్ల కూడా ఇవి తలెత్తే అవకాశం ఉంది.
అందువల్ల, ఎప్పుడో ఒకసారి తిన్న తర్వాత కడుపులో నొప్పి వచ్చినందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే నొప్పి తీవ్రంగా కొనసాగుతున్నా, మలంలో రక్తం పడటం, బరువు తగ్గడం, దీర్ఘకాలిక మలబద్ధకం/విరేచనాలు, తీవ్ర అలసట వంటి లక్షణాలు జతకలిసినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి అసలు కారణాన్ని తెలుసుకోవడం ఉత్తమం. లక్షణాలను బట్టి మీరే స్వయంగా క్యాన్సర్ అని నిర్ధారించుకోకుండా, వైద్య పరీక్షల ద్వారా సరైన కారణాన్ని తెలుసుకోవడమే సరైన మార్గం.

Leave a Reply