మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ప్రసవం తర్వాత 25 ఏళ్ల వివాహిత మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే ఆ మహిళతో పాటు పుట్టిన నవజాత శిశువు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరణానికి ముందు ఆ మహిళ ఆసుపత్రి నుంచి “నన్ను కాపాడండి” అంటూ కుటుంబ సభ్యులను వేడుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం విచారణ ప్రారంభించింది.
రీవాకు చెందిన కల్పనా మిశ్రా, ప్రసవం కోసం ఆగస్టు 25 రాత్రి సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 26 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఆమెకు సిజేరియన్ ద్వారా డెలివరీ జరిగినట్లు తెలిపారు. అయితే, ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్న కల్పన తనకు సరైన వైద్యం అందడం లేదని, తనను కాపాడాలంటూ బంధువులను వేడుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆసుపత్రిలో అందించిన చికిత్సపై కల్పన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చిన తర్వాత ఆమె మళ్లీ స్పృహలోకి రాలేదని, వైద్యుల పర్యవేక్షణ లోపించిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. వైద్య నిబంధనల ప్రకారమే సరైన చికిత్స అందించామని స్పష్టం చేసింది.
ఈ దుర్ఘటనతో ఆగ్రహించిన కల్పన బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. అధికారుల జోక్యంతో జరిపిన చర్చల అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఘటన సమయంలో విధుల్లో ఉన్న సాధనా వర్మ, సీమా ముజాల్డే అనే ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. మృతికి గల అసలు కారణాలు, వైద్యంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోంది.

Leave a Reply