ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని ఐ.టి. పార్క్ ప్రాంతంలో నివసించే నితిషా అనే మహిళ ఇంట్లో, ఏడాది క్రితం రెండు వజ్రపు ఉంగరాలు మరియు ఒక బంగారు గొలుసుతో సహా లక్షల రూపాయల విలువైన నగలు అకస్మాత్తుగా మాయమయ్యాయి.
అప్పట్లో ఆ ఇంట్లో పనిచేస్తున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన విమలా దేవి అనే యువతిపై నితిషాకు స్వల్ప అనుమానం కలిగింది. అయితే, దీని గురించి అడిగినప్పుడు, “నగల గురించి నాకేమీ తెలియదు, కావాలంటే నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను” అని చెబుతూ విమలా దేవి అమాయకురాలిలా నటించింది. ఆమె మాటలను నమ్మిన నితిషా, పోలీసులకు ఫిర్యాదు చేసేటప్పుడు తనకెవరిపైనా అనుమానం లేదని చెప్పి, ఆ పనిమనిషిని కాపాడింది.
పోలీసులు కేసు నమోదు చేసి ఏడాది గడిచినా నగలు దొరకలేదు. ఈ క్రమంలో, జూన్ 29న నితిషా తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండగా, అనుకోకుండా తన మాజీ పనిమనిషి విమలా దేవి ఇన్స్టా పేజీ కనిపించింది. అందులో విమలా దేవి పెట్టిన రీల్స్ వీడియోలు, వాట్సాప్ స్టేటస్ ఫోటోలను చూసిన నితిషా షాక్కు గురైంది. ఏడాది క్రితం తన ఇంట్లో పోయిన అదే బంగారు గొలుసును ఆమె వేసుకుని ఫోజులు ఇస్తూ కనిపించింది.
ఈ ఆధారంతో నితిషా పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూలై 1న రాజ్పూర్ పోలీసులు విమలా దేవిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో, విమలా దేవి సరైన సమయం చూసి నగలను దొంగిలించి, ఏడాదిగా నమ్మిస్తూ వచ్చినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి రూ. 10 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Leave a Reply