గుజరాత్లోని రాజ్కోట్ పీడీయూ సివిల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆక్సిజన్ స్థాయిల విషయమై, జూనియర్ మహిళా డాక్టర్ క్రిషాబెన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ రమణితో మాట్లాడారు.
ఆ సమయంలో జరిగిన చిన్న వాగ్వాదంతో ఆగ్రహానికి గురైన సదరు సీనియర్ డాక్టర్.. “నాకే పాఠాలు నేర్పిస్తావా?” అంటూ ఆ మహిళా వైద్యురాలి చెంపపై బలంగా కొట్టి తీవ్ర బెదిరింపులకు దిగాడు.
రోగులకు చికిత్స అందించే చోట జరిగిన ఈ అన్యాయాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తోటి జూనియర్ డాక్టర్లు వెంటనే విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన సీనియర్ వైద్యుడు నిత్యం మద్యం తాగి డ్యూటీకి వస్తుంటాడని, జూనియర్ డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడని.. దీనిపై గతంలోనే ఫిర్యాదు చేసినా ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యుల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోనాలి మకడియాను అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
అనంతరం ప్రద్యుమ్ననగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన సీనియర్ డాక్టర్ అశ్విన్ రమణిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించి, సదరు వైద్యుడిని విధుల నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేశారు.
వైద్యం అందించే పవిత్ర స్థలంలో మహిళా వైద్యురాలిపై జరిగిన ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్యులు తమ నిరసనను విరమించారు.

Leave a Reply