హర్యానా రాష్ట్రం పల్వాల్ (Palwal) ప్రాంతంలో సోహైల్ అనే వ్యక్తికి, 23 ఏళ్ల షాగుఫ్తా పర్వీన్కు వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ, అదనపు కట్నం కింద స్కార్పియో (Scorpio) కారు కావాలంటూ సోహైల్ తన భార్యను నిరంతరం వేధింపులకు గురిచేసేవాడు. దీనిపై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెప్పినప్పటికీ.. అతడి కట్నదాహం తీరకపోవడంతో భార్యను మళ్లీ చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు.
ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సోహైల్, భార్యతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు మద్యం మత్తులో షాగుఫ్తా గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు. పక్కనే పడుకుని ఉన్న వారి 45 రోజుల పసికందు జోహాన్ భయంతో ఏడవటం ప్రారంభించగా.. ఆ పసిపాపపై కూడా ఎలాంటి కనికరం లేకుండా గొంతు పిసికి హత్య చేశాడు.
ఈ ఘోర విషాదం వెలుగులోకి వచ్చిన తర్వాత, షాగుఫ్తా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన భర్త సోహైల్ను అరెస్ట్ చేశారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించిన సోహైల్కు.. ఒక తల్లిని, 45 రోజుల పసికందును పొట్టనబెట్టుకున్నందుకు చట్టప్రకారం ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply