నేపాల్లో గత ఆగస్టు 26న సంభవించిన భీకర వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వేలాది కుటుంబాలు తమ ఇళ్లను, ఆత్మీయులను కోల్పోయాయి.
ముఖ్యంగా భోటేకోషి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చడంతో అనేక గ్రామాలు జలసమాధి అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, ప్రాణాలతో బయటపడిన వారు తమ కుటుంబ సభ్యుల కోసం కన్నీరుమున్నీరవుతూ గాలిస్తున్నారు. ఈ క్రమంలో రసువా జిల్లాకు చెందిన 16 ఏళ్ల సమీర్ తమంగ్ కుటుంబ విషాదం ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది.
సమీర్ బడికి వెళ్లిన సమయంలో అతడి ఇంటిని వరద ముంచెత్తింది. ఇంట్లోనే ఉన్న సమీర్ చెల్లెళ్లు ప్రియా (13), పార్వతి (7) వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. చిన్న చెల్లెలి చేతికి గాయం కావడంతో ఆ రోజు బడికి వెళ్లలేదని, ఆమెను చూసుకోవడానికే పెద్ద చెల్లెలు కూడా ఇంట్లోనే ఉండిపోయిందని సమీర్ తెలిపాడు. క్షణాల వ్యవధిలోనే వరద ఇళ్లను తుడిచిపెట్టేయడంతో ఆ ఇద్దరు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. “నా చెల్లెళ్లే నాకు ప్రాణ స్నేహితులు.. రెప్పపాటులో వరద వారిని నాకు దూరం చేసింది” అంటూ సమీర్ కన్నీటిపర్యంతమయ్యాడు.
అదే రసువా జిల్లాకు చెందిన రంజూ తమంగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె తల్లి, సోదరుడు, బంధువులు వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే 14 ఏళ్ల ఆకాశ్ తమంగ్ సోదరుడు, సోదరి కూడా ఆచూకీ లేకుండా పోయారు. కుటుంబాలను కోల్పోయి ప్రాణాలతో మిగిలిన చిన్నారులను ప్రస్తుతం పునరావాస శిబిరాల్లో ఉంచారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయిన ఈ అనాథల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
మరోవైపు, మృతుల శరీరాలను గుర్తించడం నేపాల్లో అధికారులకు పెను సవాలుగా మారింది. రసువాకు చెందిన రాజ్కుమార్, ఆయన భార్య, నాలుగేళ్ల కుమారుడు వరదలో కొట్టుకుపోగా.. కొద్దిరోజుల తర్వాత లభించిన మానవ అవశేషం రాజ్కుమార్దేనా అని నిర్ధారించుకోవడానికి ఆయన సోదరుడు అమృత్ డిఎన్ఏ (DNA) పరీక్షకు నమూనాలను పంపాడు. వరద ఉధృతికి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితికి చేరడంతో, గల్లంతైన వారి కుటుంబాలకు ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలే ఏకైక ఆధారంగా మారాయి.

Leave a Reply