నేపాల్లోని త్రిశూలి నదిలో సంభవించిన భీకర వరద ప్రవాహంలో తీరప్రాంతంలోని భారీ భవనాలన్నీ పేకమేడల్లా నీటిలో కొట్టుకుపోయిన వేళ, ఒక ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం ఉగ్రరూపం దాల్చిన వరదను తట్టుకుని చెక్కుచెదరకుండా నిలబడిన వైనం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.
ఆ ఇంటి 2, 3 అంతస్తుల బాల్కనీల్లో ఒక బాలిక, మహిళలు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలబడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వరద ఉధృతి కాస్త తగ్గిన తర్వాత నేపాల్ సైనిక బలగాలు అక్కడికి చేరుకుని బాల్కనీలో చిక్కుకుపోయిన ఆరుగురినీ సురక్షితంగా కాపాడాయి.
ఈ భవనం వరదను తట్టుకుని నిలబడటం వెనుక ఎలాంటి దైవిక అద్భుతమూ లేదని, సరైన ఇంజనీరింగ్ సాంకేతికతే అసలు కారణమని స్పష్టమైంది. పటిష్టమైన ఇనుప రాడ్లు, నాణ్యమైన కాంక్రీట్తో పటిష్టంగా నిర్మించడంతో పాటు గ్రౌండ్ ఫ్లోర్లోని గోదాము తలుపులు ఒత్తిడికి తెరుచుకుని వరద నీరు ఎలాంటి అడ్డంకి లేకుండా సాఫీగా వెళ్ళిపోయింది. దీనివల్ల ప్రధాన పిల్లర్లపై నీటి పీడనం గణనీయంగా తగ్గి భవనం కూలిపోకుండా సురక్షితంగా నిలిచిందని నిర్మాణ రంగ నిపుణులు విశ్లేషించారు.

Leave a Reply