వివాహం చేసుకోకుండా భాగస్వామితో కలిసి జీవించే ‘లివ్-ఇన్ రిలేషన్షిప్’ (సహజీవనం) విధానం భారతదేశంలోని నగర ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతోంది.
ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. నగరాల్లో ఏదో ఒక బంధంలో ఉన్న అవివాహిత మహిళల్లో 6.67 శాతం మంది తమ భాగస్వాములతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది. అంటే, దాదాపు ప్రతి 100 మంది మహిళల్లో 7 మంది లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సర్వేను దేశంలోని 20 నగరాల్లో 1,798 మంది అవివాహిత మహిళల అభిప్రాయాల ఆధారంగా రూపొందించారు.
ఈ మార్పుల నేపథ్యంలో లివ్-ఇన్ సంబంధాలకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఎలా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రత, సంబంధాలలో వచ్చే సమస్యలు, విడిపోయినప్పుడు లభించాల్సిన చట్టపరమైన రక్షణ వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో.. ఇద్దరు మేజర్లు తమ స్వచ్ఛంద ఇష్టంతో జీవించే వ్యక్తిగత స్వేచ్ఛలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు లివ్-ఇన్ సంబంధాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే చట్టపరమైన నిబంధనలను తీసుకువచ్చాయి. ప్రస్తుతం మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ తరహా సంబంధాల రిజిస్ట్రేషన్, నిబంధనలు మరియు భద్రతా మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో లివ్-ఇన్ రిలేషన్లో ఉంటున్న యువతలో కొత్త చట్టపరమైన నిబంధనలపై ఆసక్తి, చర్చ పెరిగాయి.
అంతేకాకుండా, ఇంటర్నెట్ వినియోగానికి మరియు బంధాలు, వివాహం పట్ల మహిళల ఆలోచనా దృక్పథానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కూడా సర్వేలో వెల్లడైంది. ప్రతిరోజూ ఇంటర్నెట్ ఉపయోగించే మహిళల్లో.. తమ భాగస్వామిని స్వయంగా ఎంచుకోవడం, ప్రేమ వివాహాలను సమర్థించడం వంటి ఆధునిక ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అయితే, కేవలం ఇంటర్నెట్ వాడకమే మహిళలను లివ్-ఇన్ వైపు నడిపిస్తోందని ఈ అధ్యయనం చెప్పలేదని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు.

Leave a Reply