పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా ముకేరియన్ ప్రాంతంలో సెలవులపై ఇంటికి వచ్చిన ఒక ఆర్మీ జవాన్ తన భార్యను కొట్టి చంపి, మేడపై నుంచి కిందపడి చనిపోయిందంటూ కట్టుకథ అల్లిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది.
సునేహ్రా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అమర్జీత్ సింగ్, రమా దంపతులకు 8 ఏళ్ల కవల పిల్లలు (కుమారుడు, కుమార్తె) ఉన్నారు. అయితే పెళ్లయిన నాటి నుంచే అమర్జీత్ సింగ్ భార్యను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆగస్టు 13న ఆర్మీ సెలవులపై ఇంటికి వచ్చిన అమర్జీత్, అర్ధరాత్రి భార్యతో గొడవపడి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు ఆమె డాబాపై నుంచి కింద పడిపోయిందంటూ నమ్మిస్తూ ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రమా శరీరంపై ఉన్న తీవ్ర గాయాలను చూసి అనుమానం వచ్చిన పుట్టింటి వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను హత్య చేసిన ఆర్మీ జవాన్ అమర్జీత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతడికి సహకరించిన మరో ఇద్దరు బంధువుల కోసం గాలిస్తున్నారు. తల్లి మృతిచెంది, తండ్రి జైలుపాలు కావడంతో ఆ ఇద్దరు పసిపిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
