కర్ణాటకలోని సిర్సిలో పెళ్లికి మరికొద్ది గంటల సమయం ఉందనగా వధువు తన ప్రియుడితో కలిసి పరారైంది. కుటుంబ సభ్యులు ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. పెళ్లి రద్దు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కార్వార్: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సిలో పెళ్లి వేడుకలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. వధువు కల్యాణ మండపానికి చేరుకోవడానికి ముందే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఊహించని ఘటనతో పెళ్లి ఇంట్లోని సంబరాలు కాస్తా క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళంగా మారిపోయాయి.
ఈ ఘటన సిర్సి నగరంలోని ముస్లిం గల్లీలో చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే 25 ఏళ్ల సిఫా అనే యువతి, తన పెళ్లికి కొన్ని గంటల ముందే అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సిఫా ఒక MBBS విద్యార్థిని గాఢంగా ప్రేమించింది. అయితే, ఆమె ఇంట్లో వారు ఈ ప్రేమకు అంగీకరించలేదు. దీంతో వారు సిఫాకు ఇష్టం లేకపోయినా, సిర్సికి చెందిన అబ్రార్ అనే యువకుడితో అత్యవసరంగా పెళ్లి నిశ్చయించారు.
ప్రియుడితో కలిసి పరారు: నిశ్చయించిన షెడ్యూల్ ప్రకారం.. సిర్సిలోని ఉసూరి రోడ్డులో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంటికి బంధువులు, స్నేహితులు రావడం.. పెళ్లి ఆచారాలు, వేడుకల ప్రిపరేషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, సరిగ్గా ఉదయాన్నే సిఫా తన ప్రియుడితో కలిసి ఇంటి నుండి పారిపోయింది. ఈ షాకింగ్ ఘటనతో వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిత్తీరపోయారు.
క్వింటాళ్ల కొద్దీ మటన్, చికెన్ వృథా: పెళ్లికి వచ్చే అతిథుల కోసం భారీ ఎత్తున విందు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా క్వింటాళ్ల కొద్దీ మటన్, చికెన్ వంటకాలను సిద్ధం చేశారు. అయితే పెళ్లి రద్దయిపోవడంతో ఆ ఆహారమంతా పూర్తిగా వృథా అయిపోయింది. కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి జహీర్ ఖాన్.. సిర్సి మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన సమాజంలో ప్రేమకు, కుటుంబ సభ్యుల ఇష్టానికి మధ్య జరిగే ఘర్షణను మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఉదంతం ఆ ప్రాంతమంతటా హాట్ టాపిక్గా మారగా, పోలీసులు తమ శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply