మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రియుడితో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ముంబైలోని చెంబూరు ప్రాంతంలో 24 ఏళ్ల విష్ణుమాయ అనే యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు ఆశిష్ మగర్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలికి విషం కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి చంపినట్లు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఆగస్టు 25, 26 తేదీల మధ్య రాత్రి సమయంలో చెంబూరులోని ఓ ఇంట్లో విష్ణుమాయ అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, అనుమానితులను విచారించారు.
విచారణలో విష్ణుమాయకు మరొక యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతోనే ఆశిష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఆమెపై అనుమానంతోనే కూల్డ్రింక్లో విషం కలిపి తాగించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఆశిష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో చెంబూరు పోలీసులు నిందితుడు ఆశిష్ మగర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఆశిష్ విషం ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply