ముంబైకి చెందిన 25 ఏళ్ల యువతి, తన మాజీ ప్రియుడిపై మాల్వాని పోలీస్ స్టేషన్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఫిర్యాదు చేసింది.
తన తల్లి మరియు సోదరి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ (Morphing) చేసి, వాటిని సోషల్ మీడియా ద్వారా తన కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపి పరువు తీశాడంటూ సదరు యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీసులు నిందితుడిపై పరువు నష్టం, బెదిరింపులు మరియు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బాధితురాలు మాల్వాని ప్రాంతంలో తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివసిస్తోంది. గత 2025 మే నెలలో, ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా ఈమెకు ఆరిఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో, గత 2026 జనవరిలో వీరిద్దరూ కలిసి హైదరాబాద్ టూర్కు వచ్చారు. ఆ పర్యటన సమయంలోనే ఆరిఫ్ ఆ యువతి మొబైల్ నుండి ఆమె తల్లి, సోదరి ఫోటోలను, అలాగే వారి కుటుంబ సభ్యుల కాంటాక్ట్ నంబర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది.
టూర్ ముగించుకుని ముంబై తిరిగి వెళ్లిన తర్వాత, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి తరచూ గొడవలు జరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. ప్రియుడు ఆరిఫ్కు బ్రేకప్ చెప్పి అతనికి దూరంగా ఉంటోంది. దీనిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న ఆరిఫ్, ఎలాగైనా పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ యువతి తల్లి, సోదరి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘోరాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

Leave a Reply